అవకాశం దొరికిన ప్రతిసారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మానుకోట పంచాయతీ అధికారి (డీపీఓ) తీరుపై మరోసారి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.జనవరి, ఫిబ్రవరి నెలల్లో బయ్యారం మండలంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే..
బయ్యారం మండలంలో టోకెన్ వ్యవస్థను దుర్వినియోగం చేసి మొత్తం 270 జనన, మరణ ధ్రువీకరణ పత్రాల సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండానే జారీ అయినట్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరిగింది.
ఈ వ్యవహారంలో ధ్రువీకరణ పత్రాల పొందిన వారి నుంచి ఒక్కో సర్టిఫికెట్కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మొత్తాలు ఎవరి వద్దకు చేరాయి? ఇందులో అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని భావించిన ఉన్నతాధికారులు ఓ కమిటీని కూడా వేశారు.
ఇదిలా ఉండగా, బయ్యారం మండలంలో ఎంపీవోగా పనిచేసిన అధికారి బదిలీ అయిన తర్వాతే డీపీఓ నోటీసులు జారీ చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కాకుండా, బదిలీ అనంతరం చర్యలు ప్రారంభించడం వెనుక కారణం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అలాగే, 2026 ఫిబ్రవరి 6న మండల ఎంపీవో ఈ అంశంపై నివేదిక సమర్పించినప్పటికీ, దాదాపు మూడు నెలల తర్వాత 2026 మే 25న మాత్రమే డీపీఓ చార్జ్ మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేయడానికి కారణమేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడుస్తున్నా
ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఎందుకు వెనకడుగు వేస్తున్నారో నేటికి అంతుచిక్కడం లేదు.. సంబంధిత పత్రాలు, అధికారుల పాత్ర, టోకెన్ వ్యవస్థ దుర్వినియోగం, ధ్రువీకరణ పత్రాల జారీలో జరిగిన జాప్యం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితేనే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి




