తొర్రూర్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ లో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని జిల్లా సహకార అధికారి సమర్పించిన నివేదికలో తేలింది.ఆ నివేదికలో బకాయిలు రికవరీ చేయకపోవడం, కోట్ల రూపాయల రుణాల వసూళ్లలో విఫలం కావడం, నాబార్డ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి అధిక ఖర్చులు చేయడం, ఆడిట్ రిపోర్టుల్లో చూపిన లోపాలను సరిచేయకపోవడం, వార్షిక బడ్జెట్ సిద్ధం చేయకపోవడం వంటి అంశాలను తీవ్ర లోపాలుగా గుర్తించారు. అంతేకాకుండా, కమిటీ సభ్యులలోనే డిఫాల్టర్లు ఉండటం పి ఏ సి ఎస్ లో అవినీతి ఎంత లోతుగా ఉందో బహిర్గతం చేసింది.ఈ అన్ని కారణాల వల్ల ప్రభుత్వం చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ సహా ప్రస్తుత కమిటీని అనర్హంగా ప్రకటించి, వారిని పదవుల నుండి తొలగించింది. స్థానంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె. రమేష్ ను ఇంచార్జ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పరిణామాలపై ప్రతిపక్ష వర్గాలు తీవ్రంగా స్పందిస్తూ, “కాకిరాల హరిప్రసాద్ నాయకత్వంలో పి ఏ సి ఎస్ రైతుల నిధులు సురక్షితం కాలేదు. ఆర్థిక అవకతవకలతో సంస్థ ప్రతిష్ట దెబ్బతిన్నది” అని ఆరోపించాయి.
ఇవీ అవకతవకలు….
₹89 లక్షలకు పైగా బకాయిలను రికవరీ చేయకపోవడం
నాబార్డ్ మార్గదర్శకాలు ఉల్లంఘించి అధికంగా ఖర్చు చేసిన సిబ్బంది, మేనేజ్మెంట్ ఖర్చులు
₹8.39 కోట్లకుపైగా ఉన్న రుణాలలో పెద్ద మొత్తాన్ని వసూలు చేయడంలో విఫలం
డిఫాల్టర్స్ లిస్ట్ సిద్ధం చేయకపోవడం, రికవరీ చర్యలు తీసుకోకపోవడం
2021–22 నుండి 2023–24 వరకు ఆడిట్ రిపోర్టుల్లో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడం
కమిటీ సభ్యులలోనే డిఫాల్టర్లు ఉండటం
వార్షిక బడ్జెట్ సిద్ధం చేసి ఆమోదం పొందడంలో విఫలం









