బిసి బంద్ కు మావోయిస్టుల మద్దతు

బీసీ బంద్ కు మావోయిస్టుల మద్దతు…

బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్

స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనలో భాగంగా ఈ నెల 18న జరగబోవు తెలంగాణ రాష్ట్ర బందును జయప్రదం చేయాలని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ కోరారు…కరుడు కట్టిన మనువాద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కలసి పోరాడాలని ఆయన పిలువునిచ్చారు…బి సి బంద్ కు మద్దతు నిస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేసారు…అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఐక్యమై ఆరెస్సెస్ – బీజేపీ మనువాదులకు వ్యతిరేకంగా గట్టి ప్రజాందోళనను చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు…

మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖ యధాతధంగా….

పత్రికా ప్రకటన

16/10/2025

స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ సాధనలో భాగంగా ఈ నెల 18న జరగబోవు తెలంగాణ రాష్ట్ర బందును జయప్రదం చేయండి.

కరుడు కట్టిన మనువాద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కలసి పోరాడాలి.

అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఐక్యమై ఆరెస్సెస్ – బీజేపీ మనువాదులకు వ్యతిరేకంగా గట్టి ప్రజాందోళనను చేపట్టాలి.

ప్రియమైన ప్రజలారా!

ఆరెస్సెస్-బీజేపీ 11 సంవత్సరాలుగా దేశంలో ఫాసిస్టు నియంతృత్వాన్ని అమలు జరుపుతోంది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుస్మృతిని, వర్ణ వ్యవస్థ భావజాలాన్ని ప్రచారం చేస్తూ కుల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోంది . దేశంలోని ఆదివాసి, దళిత, వెనుకబడిన కులాల, మైనార్టీల అస్తిత్వాన్ని, సంస్కృతిని, భాషను నిర్మూలించే విధంగా పరిపాలన కొనసాగుతోంది. ఆరెస్సెస్ పుట్టి 100 ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా 100 రూపాయల నాణేన్ని, పోస్టల్ స్టాంపును ప్రధాన మంత్రి విడుదల చేయటంతో, స్వతంత్ర పోరాటంలో విద్రోహకర పాత్ర పోషించిన అరెస్సెస్ ను అధికార పీఠం మీద అధిష్ఠించినట్లుగా స్పష్టమైంది. ఇక రాబోవుకాలం మనువాదులకు అచ్చేదిన్ గాను, పీడిత ప్రజలకు దుర్దినాలుగా ఉంటుంది. ఈ స్థితిని మార్చేందుకు దేశప్రజలు స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ను కోరుతూ శాసన సభలో బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించింది. తరువాత ఒక ఆర్డినెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తదుపరి GO9ని విడుదల చేసింది. మనది ఫెడరల్ రాజ్యాంగం. దీని ప్రకారం రాష్ట్రాలకి అధికారాలు ఇవ్వబడ్డాయి. రాష్ట్ర పరిధిలో విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి చట్టాలు చేసుకునే అధికారం ఉన్నది. స్థానిక సంస్థల విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. ప్రభుత్వం బుసాని వింకటేశ్వరరావు కమిషన్ రిపోర్ట్(మార్చ్ 2025) ప్రకారం జీఓను విడుదల చేసింది. సమస్యను మూలం లోకి పోయి అర్ధం చేసు కుంటే పరిష్కారం దొరుకుతుంది. అంతేకానీ స్వార్థ రాజకీయాల లబ్ధి కోసం ఒక్కరిమీద ఒక్కరు బురద చల్లుకోవడం వలన ప్రజలకు నష్టం చేకూరుతుంది.

ఈ సమస్యలో న్యాయపరమైన చిక్కులను అడ్డు పెట్టి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలి. రాజ్యాంగం ప్రకారం సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్నప్పటికీ, రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని మారుతున్న పరిస్థితుల్లో ఎలా సాధించాలి అనేది ప్రధానంగా ఆలోచించాలి. దేశంలో 30 సంవత్సరాలుగా కార్పొరేట్ అనుకూల ఆర్థిక, రాజకీయ పాలసీలు

అమలు జరుగుతున్నాయి. గత 11 సంవత్సరాలుగా మనువాదులు జెట్ స్పీడ్ తో ఆర్థిక విషయంలో కార్పొరేట్ అనుకూల పాలసీలను, సామాజికంగా వర్ణ వ్యవస్థను తెచ్చే ప్రయత్నాలను తీవ్రంగా చేస్తున్నారు. దీని ఫలితంగా ఆర్ధిక అసమానతలు. సామాజిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. దీని ఫలితంగా ఎన్నో పోరాటాలు పుడుతున్నాయి. ప్రజల ఆకాంక్షల్లో భాగంగానే బీసీల రిజర్వేషన్ ముందుకు వచ్చింది. కాబట్టి నేడు కొనసాగుతున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక పాలసీలు రద్దు చేయబడితే మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ కేంద్రంలో అనేక రాష్ట్రాలల్లో తప్పుడు పద్దతులల్లో అధికారంలోకి వచ్చిన మనువాదులు నయా భారత్ నిర్మాణం చేయాలని ప్రజల మీద మారణకాండలు జరుపుతున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కలసి కేంద్రానికి వ్యతిరేకంగా న్యాయపరంగానూ, చట్టాన్ని తెచ్చేందుకు పోరాడాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో చట్టం ద్వారా ఈ సమస్య పరిష్కారం ప్రధానంగా అవుతుంది కాబట్టి అన్ని పార్టీలు, సంఘాలు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కలసి ఈ సమస్య పూర్వా పరాలను ప్రజలకు అర్థం చేయించి గట్టి ప్రజాందోళనను చేపట్టటం ద్వారానే ఈ డిమాండ్ ను సాధించుకోగలుగుతాము.

జగన్ అధికార ప్రతినిధి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here