అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారీ
పురుగుల మందు డబ్బాతో అబ్బాయి ఇంటి ముందు అమ్మాయి కుటుంబం బైఠాయింపు
అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారైన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో కలకలం రేపింది. పెళ్లికి రెండు రోజుల ముందు వరుడు కనిపించకుండా పోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వివరాల్లోకి వెళ్తే… హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండపల్లి గ్రామానికి చెందిన పొన్నాల రాజయ్య కుమార్తెకు కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన వీరబోయిన రాజయ్య చిన్న కుమారుడు కిరణ్తో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో మార్చి 6న వివాహం జరగాల్సి ఉండగా, ముందుగా వరకట్నంగా రూ.26 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు అమ్మాయి తండ్రి పొన్నాల రాజయ్య తెలిపారు. ఎంగేజ్మెంట్ సమయంలో రూ.10 లక్షలు నగదుగా ఇచ్చినట్లు చెప్పారు.
పెళ్లి సమయం దగ్గరపడుతున్న వేళ వరుడు కుటుంబ సభ్యులు అదనంగా రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. అంత మొత్తాన్ని ఇవ్వడం సాధ్యం కాదని అమ్మాయి కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో, పెళ్లికి రెండు రోజుల ముందు వరుడు కిరణ్ కనిపించకుండా పోయినట్లు తెలిపారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పొన్నాల రాజయ్య వెల్లడించారు.
అదేవిధంగా, వరుడు తల్లిదండ్రులే తమ కుమారుడిని దాచిపెట్టి అదనపు కట్నం కోసం పెళ్లిని నిలిపివేశారని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి ఆగిపోవడంతో తమ కుటుంబ పరువు దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అబ్బాయి ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో బైఠాయించి ఆందోళన చేపట్టారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.






